ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే బీఎస్పీ మద్దతు

  • ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
  • ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయించినట్టు వెల్లడి
  • ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్ ఖడ్ 
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగ్ దీప్ ధన్‌ఖడ్ కు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టు ఆమె బుధవారం వెల్లడించారు. 

‘దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి కారణంగా ఉప రాష్ట్రపతి పదవికి కూడా ఆగస్టు 6న ఎన్నికలు జరగబోతున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో జగ్ దీప్ ధన్ ఖడ్ కు మద్దతు ఇవ్వాలని బీఎస్పీ నిర్ణయించింది’ అని ఆమె ప్రకటించారు. 

 ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వాను కాంగ్రెస్ నిలబెట్టింది. మాయావతి ఇంతకుముందు రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చారు. 


vice president
election
nda
bsp
Mayawati

More Telugu News